
తెలుగులో హిట్ అనిపించుకున్న సినిమాలన్నీ తమిళంలోకి రీమేక్ అయ్యే ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది. తమిళంలో సీజనల్గా ఏం సినిమాలు రిలీజవుతాయా? ఏం హిట్ అవుతాయా అని ఎదురు చూస్తూ ఉండే తెలుగు పరిశ్రమకు ఇది రివర్స్ అనుభూతి అన్నమాట. ఓ మోస్తరు తెలుగు హిట్లు కూడా తమిళ రీమేక్ల బాట పడుతున్నాయి.అయితే కొన్ని సినిమాలు ఇక్కడి హీరో, హీరోయిన్స్కు తమిళంలో ఉండే క్రేజ్నుబట్టి డబ్బింగ్ అవుతున్నాయి. లోబడ్జెట్లో తారాబలం లేకుండా తెలుగులో ఇటీవలే విడుదలైన ‘అలామొదలైంది’ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసేందుకు, ఫ్యాన్సీ ఆఫర్ ముట్టజెప్పేందుకు కొందరు తమిళ నిర్మాతలు సిద్ధమైనట్లు సమాచారం. అలాగే అనుష్క, అల్లుఅర్జున్, మనోజ్ల కాంబినేషన్లో కృష్ దర్శత్వంలో వచ్చిన ‘వేదం’ చిత్రాన్ని తమిళంలో ‘వానమ్’గా రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. రాజమౌళి దర్శకత్వంలో రవితేజ, అనుష్కల కాంబినేషన్లో వచ్చిన ‘విక్రమార్కుడు’ తమిళంలో కార్తి, తమన్నా కాంబినేషన్లో ‘సిరుతె్తై’గా విడుదలై తమిళనాట విజయఢంకా మోగిస్తోంది. తెలుగులో నాగార్జున నటించిన కమర్షియల్ హిట్ చిత్రం ‘రగడ’ తమిళంలో ‘వంబు’గా విడుదలౌతోంది. మహేష్బాబు నటించిన ‘ఖలేజా’ తమిళంలో ‘భద్ర’గా డబ్బింగ్ చేస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు సునీల్, రాజమౌళిల కాంబినేషన్లో వచ్చిన ‘మర్యాదరామన్న’ తమిళ రైట్స్ ఆ మధ్య రూ.35 లక్షలకు ఓ నిర్మాత సొంతం చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. ప్రకాష్రాజ్ కూడా ఇప్పుడు తెలుగు లేటెస్ట్ హిట్ చిత్రాలను తమిళం, కన్నడంలో రీమేక్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. రానా నటించిన తొలి చిత్రం ‘లీడర్’ రీమేక్ చేసే యోచనలో ప్రకాష్రాజ్ ఉన్నారని వార్తలొస్తున్నాయి.
No comments:
Post a Comment